సినిమాల్లో ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు అనసూయ. ఎన్నో ఏళ్ళు జబర్దస్త్ యాంకర్ అనిపించుకున్న ఈ భామ ఇప్పుడు తప్పుకున్న విషయం మనందరికీ తెలుసు. ‘జబర్దస్త్’ కార్యక్రమం నుంచి పక్కకి వచ్చిన అనసూయ ఇప్పుడు అసలు విషయం బయట పెట్టారు.
జబర్దస్త్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదంట. రెండేళ్ల నుంచి అనుకున్న ప్లానంట.
“నాగబాబు, రోజా తప్పుకున్న తర్వాత నేను కూడా బయటికి వచ్చాను అనుకోవడం తప్పు. నేను గొర్రెను కాదు. నేను స్వతంత్రంగా ఆలోచిస్తా. రెండేళ్ల నుంచి అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు సాధ్యమైంది,” అని తెలిపారు అనసూయ.
‘జబర్దస్త్’లో కామెడీ, కొన్ని మాటలు శృతి మించిపోవడంతో తప్పుకోవాలని రెండేళ్ల క్రితం అనుకుందట. తాను కొన్ని మాటలకు, జోకులకు అభ్యంతరం తెలిపానని ఆమె తెలిపారు.
ఐతే, అనసూయ టీవీ షో నుంచి తప్పుకున్న తర్వాత నీతులు చెప్తోందని, ఇన్నాళ్లూ హాయిగా జబర్దస్త్ కుళ్ళు జోకులకు నవ్వింది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఇంతకుముందే ఈ మాటలు చెప్పాల్సింది అనేది వీరి మాట.
అనసూయ త్వరలోనే ‘పుష్ప 2’ షూటింగ్ లో పాల్గొంటారు. ఆమెకి సినిమాల్లో చాలా అవకాశాలు వస్తున్నాయి.
This post was last modified on August 14, 2022 6:18 pm