పరిశ్రమలో ఎన్నో వివాదాలు. కొన్ని అలానే వివాదాస్పదంగా మిగిలిపోతాయి. మరికొన్ని వ్యక్తుల మధ్య బంధాల్ని మరింత బలోపేతం చేస్తాయి. గాన గంధర్వుడు బాలు, సూపర్ స్టార్ కృష్ణ మధ్య వివాదం కూడా అలాంటిదే.
ఓ సందర్భంలో బాలు-కృష్ణ మధ్య వాగ్వాదం జరిగింది. అలా జరగడానికి అంతకుముందు వాళ్లిద్దరి మధ్య వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ప్రధాన కారణం. మొత్తానికి కారణం ఏదైతేనేం కృష్ణ సినిమాల్లో బాలు పాడడం మానేశారు. బాలు కెరీర్ ప్రారంభంలో కృష్ణకి పాడి టాప్ సింగర్ గా ఎదిగారు. కృష్ణ కూడా బాలు పాట లేకపోతే అస్సలు ఒప్పుకునేవారు కాదు. అలాంటి వారి మధ్య గొడవలు రావడంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ALSO READ: నీ గళం ఎలా మరువగలం?
బాలు గాత్రం లేకుండానే చాలా సినిమాలు అప్పట్లో రిలీజయ్యాయి. “సింహాసనం” సినిమాలో రాజ్ సీతారాం అనే గాయకుడితో కృష్ణ పాడించడం అందరికి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పూడ్చడానికి వేటూరి లాంటి ప్రముఖులు ప్రయత్నించినప్పటికీ సయోధ్య కుదరలేదు.
ALSO READ: ‘బాలును అలా పిలవడం మానేశా’
చివరికి ఏం జరిగిందో ఏమో.. ఓ రోజు సడెన్ గా పద్మాలయా స్టుడియోస్ లో ప్రత్యక్షమయ్యారు బాలు. ఆయన్ను చూసి అంతా షాక్ అయ్యారు. బాలు నేరుగా కృష్ణ ఉన్న గదిలోకి వెళ్లారు. కృష్ణ సాదరంగా ఆహ్వానించారు. బాలు ఏదో వివరణ ఇవ్వబోయారు. కృష్ణ వారించారు. ఇకపై ఆ ప్రస్తావన వద్దన్నారు. అలా బాలు-కృష్ణ సహృద్భావ వాతావరణంలో మళ్లీ కలిసిపోయారు. ఆ తర్వాత కృష్ణకు అతడి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆలపించారు బాలు. ఆయన అజాతశత్రువు అనడానికి ఇదొక ఉదాహరణ.
This post was last modified on September 26, 2020 6:48 pm