
“యానిమల్” చిత్రంతో బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సూపర్ స్టార్ గా నిలబడిపోయాడు. ఈ సినిమాకు ముందు కూడా రణబీర్ పెద్ద హిట్స్ ఇచ్చాడు కానీ మాస్ హీరోగా అవతరించాలి అన్న అతని కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇక ఈ సినిమాతో దర్శకుడు సందీప్ వంగా ఇండియాలోనే అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ దియోల్ కి కొత్త ఇన్నింగ్స్ ఘనంగా స్టార్ట్ అయింది.
అంతెందుకు, ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన తృప్తి దింరి జీవితం మొత్తం మారిపోయింది.
వీళ్లకు వచ్చినంత క్రేజ్ రష్మిక రాలేదా? నిజానికి రష్మికకి నటిగా బాగా పేరు వచ్చింది. ఇంతకుముందు ఆమె నటన గురించి జనం ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు. కానీ రణబీర్ కపూర్ వంటి గొప్ప నటుడి ముందు ఒక సీన్ లో ఆమె చేసిన పర్ఫరార్మెన్స్ బాగా కాంప్లిమెంట్స్ తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ లోనే అగ్ర హీరోయిన్లలో ఒకరిగా స్థిరపడింది.
ఇప్పుడు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు, దర్శకులు రష్మిక డేట్స్ కోసం వెంట పడుతున్నారు. ఐతే, రష్మిక బాలీవుడ్ లో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా కొత్తగా ఒప్పుకొంది. మిగతా ఆఫర్లను ఒప్పుకోలేదు. ముందుగా ఆమె తెలుగులో ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొత్త చిత్రాలు సైన్ చేస్తుంది.

తెలుగులో ఆమె ఇప్పుడు “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాలో నటిస్తోంది. మంగళవారం (డిసెంబర్ 12)తో ఆమె మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత “పుష్ప 2” షూటింగ్ లో పాల్గొంటుంది. వచ్చే నెల 4 వరకు ఆమె “పుష్ప 2″లో నటిస్తుంది. ఆ తర్వాత తెలుగు- తమిళ భాషల్లో రూపొందుతోన్న “రెయిన్ బో” అనే సినిమాకి సంబంధించిన మిగిలిన భాగం పూర్తి చెయ్యాలి.
2024లో ఆమె విక్కి కౌశల్ సరసన ఒక బాలీవుడ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే సైన్ చేసింది. మిగతా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ 2024లో తన డేట్స్ ని బట్టి ఒప్పుకుంటుందట. ఒక్కసారిగా రష్మిక ఇప్పుడు తీరికలేనంతగా బిజీ అయిపోయింది.