రజినీకాంత్ సినిమా అంటే బాలసుబ్రమణ్యం పాట ఉండాల్సిందే. కెరీర్ ప్రారంభం నుంచి బాలు పాట రజినీకాంత్ చిత్రాల్లో పల్లవించింది. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కి బాలు గొంతు ఉండాల్సిందే అనే సెంటిమెంట్ తమిళనాట ఉంది. రెహమాన్ వచ్చిన తర్వాత రజిని సినిమాల్లో బాలు పాడిన పాటలు తక్కువే. కానీ, కనీసం ఒక పాట అయినా బాలు చేత పాడించేవారు.
ఇప్పుడు బాలు మన మధ్య లేరు. ఆయన మనల్ని వీడి ఏడాది గడిచింది. ఐతే, ఆయన పాడిన చివరి పాట బయటికి వచ్చిందిప్పుడు. రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నతే’ సినిమా నుంచి తొలి సాంగ్ వచ్చేసింది. ఈ పాటని బాలసుబ్రమణ్యం పాడారు. లాస్ట్ ఇయర్ రికార్డు చేశారు కానీ అది తాజాగా విడుదలైంది.
“45 ఏళ్ళు నా గొంతుగా ఉన్నారు బాలు. ఈ పాట షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఇదే మా ఇద్దరి కాంబినేషన్ లో చివరి పాట అవుతుందని ఊహించలేదు. ప్రియమైన నీ పాట అజరామరం,” అని రజినీకాంత్ ట్వీట్ చేశారు.
రజినీకాంత్, కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ నటించిన ఈ మూవీకి శివ దర్శకుడు. దీపావళి కానుకగా వచ్చే నెల 4న విడుదల కానుంది.
ఈ పాటని ఇమ్మాన్ స్వరపరిచారు.