
కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయానికి చాట్ జిపిటి వంటి ఏఐ టూల్స్ పై ఆధారపడటం కంటే, పక్కనున్న స్నేహితులతో మాట్లాడి విషయాలు తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్పీచ్ ను శృతి హాసన్ (Shruti Haasan) సోషల్ మీడియాలో షేర్ చేసింది. తండ్రి కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవించింది.
ఏఐ టూల్స్ వాడిన ప్రతిసారి డేటా సెంటర్లు ప్రాసెసింగ్ కోసం భారీ మొత్తంలో విద్యుత్, నీరు వినియోగిస్తాయని కమల్ అన్నారు. చాట్ జిపిటిని ఒక ప్రశ్న అడిగినప్పుడల్లా ఒక గ్లాసు నీరు వృథా అవుతుందని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు.
అనవసరమైన విషయాలు ఏఐని అడగడం మానేయాలని, మిగతా సమయాల్లో పక్కనే ఉన్న స్నేహితులతో చర్చించాలని సూచించారు. ఏఐ కంటే మన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర చాలా సమాచారం ఉంటుందన్న కమల్ కామెంట్స్ తో శృతిహాసన్ ఏకీభవించింది.
వ్యవసాయ రంగంతో పోలిస్తే ఏఐ ఎక్కువ నీటిని వినియోగిస్తుందనే వీడియోను షేర్ చేసింది.
ఏఐ గురించి అవగాహన పెంచుకోవడానికి 2024లో అమెరికా వెళ్లి 90 రోజుల కోర్సులో చేరారు కమల్. అయితే షూటింగుల వల్ల ఆయన 45 రోజులు మాత్రమే ఆ కోర్సుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏఐ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఏఐని చూసి భయపడాల్సిన అవసరం లేదనేది కమల్ మాట.
