బాలయ్య 50 లక్షల విరాళం

TeluguCinema 30 Aug 2025
Nandamuri Balakrishna

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తన వంతుగా నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి అందచేస్తారు.

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కింది. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈవెంట్‌లోనే నందమూరి బాలకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో వరదలకు అతలాకుతలం అయిన ప్రాంతాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షల ఆర్థిక విరాళాన్ని కూడా ప్రకటించారు.

బాలయ్య చెప్పిన మాటలు: “ఇండస్ట్రీలో 50 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తి చేశాను. నాకు ఈ లెక్కలన్నీ సరిగ్గా గుర్తుండవు. అంకెలన్నీ కూడా అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. నా మనవళ్లు కూడా నన్ను బాలా అని పిలుస్తుంటారు. నటుడిగా మా నాన్న గారే నాకు స్పూర్తి. రాజకీయాల్లోకి రాక ముందే ప్రజా సేవా చేసేవారు. వరదల సమయంలో ముందుండి సాయం చేసేవారు. ప్రాంతాలు వేరైనా సరే విపత్కర పరిస్థితుల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అందరి సహాయ సహకారాలతో క్యాన్సర్ హాస్పిటల్‌‌ను నడిపిస్తున్నాను. నేను నా హిందూపురం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. కోట్ల మంది అభిమానాన్ని పొందడం నా పూర్వ జన్మ సుకృతం, జన్మజన్మల రుణబంధం అని అనిపిస్తుంటుంది. సినిమా అనేది బలమైన మాధ్యమం. నా దర్శక, నిర్మాతల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. ఏపీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ, ఏపీలోనూ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. కళకి ఎప్పుడూ భాషా బేధం, లింగ బేధం ఉండదు. మన తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ఇది మన తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం.

ఈ రోజు నాకు ఇలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ నుంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నేను 13 ఏళ్ల వయసులోనే ‘తాతమ్మ కల’ మూవీ చేశాను. గత ఐదు దశాబ్దాల్లో నేను ఎన్నో జానర్లలో, ఎన్నెన్నో పాత్రల్ని పోషించాను. ‘ఆదిత్య 369’ అనేది ఇండియాలో మొట్ట మొదటి సైఫై చిత్రం. 50 ఏళ్లలో 110 చిత్రాలు చేశాను. నాకు విషెస్ అందించిన అమితాబ్ గారికి, రజినీకాంత్ గారికి ధన్యవాదాలు. అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను. ఇదే ఉత్సాహం, ప్యాషన్‌తో మున్ముందుకు సాగుతానని మాటిస్తున్నాను. ఈ జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.”