పొట్టి వీరయ్య కన్నుమూత

TeluguCinema 25 Apr 2021
Potti Veeraiah

గట్టు వీరయ్య…అంటే వెంటనే పోల్చుకోలేరేమో కానీ పొట్టి వీరయ్య అంటే చాలు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. తన ఆకారంతోనే పాపులర్ అయిన నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు. ఆదివారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కన్ను మూశారు వీరయ్య.

ఆయన 1947లో నల్గొండ జిల్లా ఫణిగిరిలో పుట్టారు. పుట్టుకతోనే మరుగుజ్జు ఆయన. అదే ఆయనకి నటుడిగా అన్నం పెట్టింది.

విఠలాచార్య తీసిన ‘అగ్గిదొర’ చిత్రంలో మరుగుజ్జు పాత్రతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 500 చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. ఎక్కువ కామెడీ రోల్సే . తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించారు. చివరి దశలో పేదరికంతోనే ఇబ్బంది పడ్డ నటుల్లో పొట్టి వీరయ్య కూడా చేరారు. ‘తాత మనవడు’, ‘జగన్మోహిని’, ‘యుగంధర్‌’, ‘గజదొంగ’ వంటి పలు పాపులర్ మూవీస్ చిత్రాలు ఆయనకీ మంచి పేరు తెచ్చాయి.