శిల్పా… 60 కోట్లు కట్టు!

శిల్పాశెట్టికి ఈ రోజు బాంబే హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. ఇంకా చెప్పాలంటే చిన్నపాటి షాక్ తగిలింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా… ఆర్థిక వ్యవహారాలకి సంబంధించిన కేసులో ఇరుక్కున్నారు. తనకి ఇవ్వాల్సిన 60 కోట్లు ఎగ్గొట్టారని, మోసం చేశారని వారితో ఒక వ్యాపారంలో భాగస్వామిగా వ్యవహరించిన ఒక వ్యక్తి కేసు వేశారు. ఆ కేసులో ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటిస్ జారీ చేశారు. శిల్పాశెట్టిని ఇటీవల విచారించారు.
ఒక వ్యక్తిపై లుక్ అవుట్ నోటీసు జారీచేస్తే విదేశాలకు వెళ్లే వీలు ఉండదు. ఎయిర్ పార్టీలోనే ఆపేస్తారు. అందుకే, తాజాగా శిల్పాశెట్టి, ఆమె భర్త తమపై ఉన్న లుక్ ఔట్ నోటీస్ రద్దు చెయ్యాలని కోరుతూ బాంబే హైకోర్టుని పిటిషన్ వేశారు.
వ్యాపార పని నిమిత్తం తాము ఈ నెల శ్రీలంక వెళ్లాలని కోర్టుకు తెలిపారు. మీరు వ్యాపారం కోసమే అక్కడికి వెళ్తున్నారు అని నిరూపించండి అని జడ్జి అడిగారు. దానికి శిల్పా శెట్టి లాయరు తమకు కొంత సమయం కావాలని జడ్జిని కోరారు. దాంతో కేసుని ఈ నెల 14కి వాయిదా వేశారు. ఐతే, ఈలోపే శిల్పాశెట్టి, ఆమె భర్త శ్రీలంక వెళ్లాల్సి ఉందని లాయర్ తెలిపారు. దాంతో, జడ్జి నవ్వి, సరే ఐతే 60 కోట్లు రూపాయలు డిపాజిట్ కట్టమని చెప్పండి అని అనడంతో శిల్పా లాయర్ తెల్లముఖం వేశారు.
శిల్పా శెట్టి, ఆమె భర్త ఈ కేసు పూర్తి అయ్యేవరకు విదేశాలకు వెళ్లే అవకాశం లేదు.