పృథ్వీ భరణం చెల్లించాల్సిందే!

TeluguCinema 01 Oct 2022
Prudhviraj

భార్య నుంచి విడిగా ఉంటున్న నటుడు పృథ్వీకి షాక్ తగిలే తీర్పు ఇచ్చింది కోర్టు. భార్య నుంచి విడిపోయాడు కానీ ఆమెకి ఇవ్వాల్సిన భరణం ఇవ్వకుండా, ఆమెని పట్టించుకోకుండా ఉంటున్నాడు పృథ్వీ. ఆమె చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. గొడవ చేశారు. ఐతే, ఆమె నాకు సంబంధం లేదని, ఆమె నుంచి విడిపోయాను కాబట్టి మీడియా తనని ఆమె గురించి అడగొద్దని చెప్తూ వస్తున్నాడు పృథ్వీ.

తనకి భరణం ఇప్పించాలని ఆయన మాజీ భార్య శ్రీలక్ష్మి కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. 2017 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆమెకి నెలకు లక్షలు రూపాయలు చొప్పున ఇవ్వాలని విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పృథ్వీ నటుడిగా కోట్లు సంపాదించాడు. ఇప్పటికీ నెలకు 30 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నాడు అని ఆమె రుజువు చేశారు. దాంతో కోర్టు భరణం కింద నెలకు లక్ష ఇవ్వాలని ఆదేశించింది.

పృథ్వీకి ఇది షాక్. 2017 నుంచి ఇప్పటివరకు బకాయిలు కూడా ఇవ్వాలంటే కోట్లల్లో చమురు వదులుతుంది.