
ఈసారి సంక్రాంతి పండగకి “హనుమాన్” సినిమాకి థియేటర్లు దొరకలేదు. దాంతో పెద్ద వివాదం రేగింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ సినిమాకి థియేటర్లు దక్కకుండ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్ రాజు మండిపడ్డారు. ఇలాంటి అబద్దాలను ప్రచారం చేసే వాళ్ళ తాట తీస్తాను అని హెచ్చరించారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా “హనుమాన్” సినిమా బిగ్ విన్నర్ గా నిలిచింది.
ఈ సంక్రాంతికి నిజమైన బిగ్ హిట్ “హను మాన్”. ఈ సారి జరిగిన వివాదాల నేపథ్యంలో ఇద్దరు నిర్మాతలు వచ్చే సంక్రాంతి కోసం అప్పుడే కర్చీఫ్ వేశారు.
2025 సంక్రాంతి పండుగకి విడుదల చేస్తామని “విశ్వంభర” నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో. “బింబిసార” తీసిన యువ దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకి డైరెక్టర్. ఇటీవలే షూటింగ్ మొదలైంది. కానీ విడుదల మాత్రం సంక్రాంతి 2025 అని నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ప్రకటించింది.
అలాగే నిర్మాత దిల్ రాజు కూడా “శతమానం భవతి”కి సీక్వెల్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. “శతమానం భవతి 2” కూడా సంక్రాంతి పండగకి విడుదల కానుంది.