‘మహానటి’ మేకర్స్ కి సత్కారం

వచ్చే డిసెంబర్ 6న మహానటి సావిత్రి 90వ జయంతి. ఈ సందర్భంగా ఆమె కూతురు విజయచాముండేశ్వరి తమ తల్లి పేరిట సావిత్రి మహోత్సవ్ నిర్వహిస్తున్నారు.
ఈ తరానికి సావిత్రి జీవిత విశేషాలు, ఆమె గొప్పతనం నాగ్ అశ్విన్ తీసిన “మహానటి” సినిమా ద్వారా ఎక్కువగా తెలిసింది. అందుకే ఆ టీంకి సావిత్రి 90వ జయంతి సందర్భంగా ప్రత్యేక సన్మానం చెయ్యనున్నారు.
“మా మాతృమూర్తీ, మహానటీ అయిన శ్రీమతి సావిత్రి గారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహోత్సవ్’ పేరిట నిర్వహిస్తున్నాం. ప్రముఖ కళా సంస్థ “ సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో ‘మహానటి’ చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ లనూ, ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లనూ ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు,” అని ఒక ప్రకటనలో విజయచాముండేశ్వరి తెలిపారు.
1934లో జన్మించిన సావిత్రి 1981లో 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు.