మళ్ళీ ఉదిత్ నారాయణ పాట

ఒకప్పుడు తెలుగులో ఉదిత్ నారాయణ పాట లేకుండా సినిమా విడుదల అయ్యేది కాదు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య వంటి అప్పటి టాప్ హీరోలకు ఉదిత్ నారాయణ ఒక పాడాల్సిందే అనే రూల్ ఉన్నట్లు ఆయన హవా సాగింది.
చాలా గ్యాప్ తర్వాత ఆ వెటరన్ సింగర్ తెలుగులో మళ్ళీ పాట పాడారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం కోసం తన గొంతు విప్పారు. గతంలో చిరంజీవికి ఆయన “రామ్మా చిలకమ్మా” వంటి సెన్సేషనల్ పాటలు పాడారు. ఇప్పుడు “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రంలో “మీసాల పిల్ల” అనే పాటని ఉదిత్ నారాయణ ఆలపించారు.
భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటలో చిరంజీవి నయనతారని “మీసాల పిల్ల” అని ఆట పట్టిస్తుంటారు. 2000 తొలినాళ్లలో ఊపు ఊపిన గాయకులతో మళ్ళీ పాటలు పాడించడం “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మొదలు పెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమాలో రమణ గోగులతో “గోదారి గట్టు మీద రామ చిలుక” పాట పాడించాడు. ఇప్పుడు ఉదిత్ నారాయణని దింపారు.
చిరంజీవి ఈ పాటలో ఏఐ సాఫ్ట్వేర్ తో తీర్చిదిద్దిన ఫొటోలా యూత్ ఫుల్ గా మెరిసిపోతున్నారు.