![Koratala Siva](https://telugucinema.com/wp-content/uploads/cwv-webp-images/2022/04/Koratala-Siva-1024x768.jpeg.webp)
“శ్రీమంతుడు” సినిమా కథను దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టి తీసినట్లు నిర్ధారణ అయింది. సుప్రీం కోర్టుకు వెళ్లినా కొరటాల శివకు ఊరట లభించలేదు. రచయితగా అనేక సినిమాలకు పని చేసిన కొరటాల శివ “శ్రీమంతుడు” సినిమాని మహేష్ బాబు హీరోగా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా విడుదలైన కొన్నాళ్ళకు రచయిత శరత్ చంద్ర ఇది నా కథ అంటూ నాంపల్లి కోర్టులో కేసు వేశారు.
అనేక నెలల పాటు విచారణ, వాయిదాల తర్వాత నాంపల్లి కోర్టు శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కొరటాల శివ కాపీ కొట్టి తీసినందున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ కొరటాల శివ సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు సుప్రీం కోర్టు నాంపల్లి కోర్టు తీర్పుని సమర్ధించింది. దాంతో, కొరటాల శివ తరఫు లాయర్ తమ పిటిషన్ ని వాపస్ తీసుకుంటున్నట్లు సుప్రీంకి తెలిపారు.
అంటే నాంపల్లి ఇచ్చిన తీర్పుని కొరటాల శివ పాటించాలి. అంటే, ఆయన కథని కాపీ కొట్టినట్లే అని అంగీకరించకతప్పదు.