కన్ఫర్మ్: లూసిఫర్ డైరెక్టర్ మారలేదు

Mohan Raja

“లూసిఫర్” రీమేక్ ఆగిపోయిందని ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత దర్శకుడు మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. ఐతే, ఈ రెండూ తప్పని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ ప్రచురించింది.

Advertisement
దర్శకుడు మోహన్ రాజా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని, తమన్ తో కలిసి సంగీత చర్చలు కూడా జరుపుతున్నారని తెలిపాం.

ఇప్పుడు అదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి టీం క్లారిటీగా చెప్పింది. ఈ రోజు దర్శకుడు మోహన్ రాజా పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొణిదెల ప్రొడక్షన్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు తమ దర్శకుడికి బర్త్ డే విషెస్ తెలిపాయి.

“మా #చిరు153 దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు…” అని పోస్టర్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాయి. అలా అధికారికంగా ఈ సినిమా గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాయి నిర్మాణ సంస్థలు.

మలయాళంలో సూపర్ హిట్టయిన “లూసిఫర్” సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేశారు. ఐతే, లాంచ్ చేసి చాలా కాలమే అయినా షూటింగ్ మొదలు కావట్లేదు. దాంతో చాలామందికి అనుమానాలు మొదలయ్యాయి. అందుకే, ఇన్ని పుకార్లు, ఊహాగానాలు.

ఈ సినిమా షూటింగ్ మొదలు కావాలంటే… ముందుగా కొరటాల శివ తీస్తున్న ‘ఆచార్య’ పూర్తి కావాలి. కోవిడ్ 19 సంక్షోభం వల్ల ‘ఆచార్య’ షూటింగ్ కి రెగ్యులర్ గా బ్రేకులు పడుతున్నాయి. దాంతో ‘లూసిఫర్ రీమేక్’ షూటింగ్ కూడా స్టార్ట్ కావడం లేదు.

Advertisement
 

More

Related Stories