
“చూడాలని ఉంది”, “ఒక్కడు” వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఇటీవల “యుఫోరియా” (Euphoria) అనే న్యూ-ఏజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఈ చిత్రానికి స్పందన లభిస్తోంది. జూన్ 2న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘యుఫోరియా’ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది
“నా కెరీర్లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ‘యుఫోరియా’ మరో ఎత్తు. ఈ తరహా సినిమాలు ఇంకా చేయాలని సోషల్ మీడియాలో చాలా మంది కోరుతున్నారు. యూట్యూబ్లో ఈ సినిమాపై వచ్చిన విశ్లేషణాత్మక రివ్యూలకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈటీవీ విన్, ఆహా ప్లాట్ఫారమ్లలోనూ అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా నాకు కొత్త ఎనర్జీ ఇచ్చింది. అందుకే ఈసారి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాలని అనిపించింది,” అని చెప్పారు.
మార్కెటింగ్లో విఫలమయ్యాను
“సినిమాను తీయడం ఒక కళ అయితే, దాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం మరో కళ. నిర్మాతగా నేను మార్కెటింగ్ విషయంలో సఫలం కాలేకపోయాను. అందుకే ‘యుఫోరియా’ థియేటర్లలో ఆశించిన స్థాయికి చేరలేదు. ఇకపై నేను సొంతంగా సినిమాలు నిర్మించను. మార్కెటింగ్లో బలమైన భాగస్వామ్యంతోనే ముందుకు వెళ్తాను,” అని అన్నారు.
హీరో కోసం కాదు.. కథ కోసం హీరో రావాలి
ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాట్లాడిన గుణశేఖర్, “ముందుగా హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం మానేయాలి. కథ పూర్తయ్యాక ఆ కథకు సరిపోయే హీరో దగ్గరకు వెళ్లాలి. హీరో డేట్స్ ఉన్నాయి కాబట్టి అతనికి తగ్గట్టు కథను మార్చడం వల్ల చాలా సినిమాలు ఒకే మూసలో పడిపోతున్నాయి,” అని వ్యాఖ్యానించారు.
“ఒక్కడు కథను నేను కథగా రాశాను. ఆ తర్వాత అది మహేష్ బాబుకు సరిపోయింది. ఒకవేళ మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా రాసి ఉంటే అది మరో ‘సైనికుడు’ అయ్యేదేమో,” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘యుఫోరియా’ తర్వాత నాలుగు కథలు సిద్ధం
“ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటికే నాలుగు కథలు రాశాను. వాటిలో ఒక కథ పూర్తిగా సిద్ధంగా ఉంది. అది ఒక హీరోకు అద్భుతంగా సరిపోతుంది. త్వరలోనే ఆయనకు కథ చెప్పాలని అనుకుంటున్నాను. ఈ కథ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. వినగానే వెంటనే తీయాలనిపించేంతగా నన్ను ఉత్తేజపరిచింది,” అని చెప్పారు.
అలాగే తన వద్ద ఒక భారీ పీరియడ్ డ్రామా కూడా ఉందని, దానికి పెద్ద బడ్జెట్ అవసరమని తెలిపారు. సరైన నిర్మాణ సంస్థ, సరైన సమయం దొరికినప్పుడు ఆ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తానని చెప్పారు.
‘హిరణ్యకశ్యప’ ఇక ఆ రూపంలో ఉండదు
ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్న “హిరణ్యకశ్యప” ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, “హాలీవుడ్ సంస్థ ఫాక్స్ స్టార్తో కలిసి ఈ సినిమాను రూపొందించాలని భావించాం. మూడు నాలుగేళ్లు ప్రీ-ప్రొడక్షన్కే వెళ్లిపోయాయి. ఆ సమయంలో కరోనా వచ్చింది. తర్వాత ఫాక్స్ స్టార్ను డిస్నీ కొనుగోలు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. 300 కోట్ల బడ్జెట్తో ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం సాధ్యపడలేదు,” అని వివరించారు.
త్రివిక్రమ్ పేరు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు స్పందిస్తూ, “రానాతో ఈ సినిమా ప్లాన్ చేసినప్పుడు త్రివిక్రమ్ గారే ఫోన్ చేసి మాటలు రాస్తానని చెప్పారు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. నా విజువలైజేషన్ను ఎక్కడైనా వాడుతున్నారేమోనని ఒక దశలో బాధపడ్డాను. ఆ విషయంపై త్రివిక్రమ్ గారితో కూడా మాట్లాడాను,” అని తెలిపారు.
ఇకపై గ్యాప్లు ఉండవు
“రుద్రమదేవి తర్వాత ‘హిరణ్యకశ్యప’ కోసం ఎనిమిదేళ్లు వృథా అయ్యాయి. ఆ సమయంలో నేను అనుకున్న ఎన్నో ఆలోచనలతో ఇతర సినిమాలు వచ్చేశాయి. అందుకే ఇకపై సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాను. బౌండ్ స్క్రిప్ట్లతో సిద్ధంగా ఉండి హీరోలు, నిర్మాతలకు కథలు వినిపిస్తాను. ఇకపై వరుసగా సినిమాలు చేయాలనేది నా లక్ష్యం,” అని గుణశేఖర్ స్పష్టం చేశారు.
