
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని తీసుకున్నారని ప్రచారం ఊపందుకొంది. ఇటీవల తల్లి అయిన ఆమె ఈ చిత్రంతోనే మళ్లీ నటిగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా మీడియా సంస్థలు వార్తని ప్రచురించాయి.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కత్రినా మళ్లీ తెలుగు సినిమాలో నటించబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం, కత్రినా కైఫ్ ‘స్పిరిట్’లో నటిస్తున్నారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవే. ప్రస్తుతం ఆమె రీ-ఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తల్లిగా తన కొత్త జీవితాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తిరిగి ఏ సినిమాతో నటిగా రావాలనే విషయంలో కూడా ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
‘స్పిరిట్’లోని కీలక పాత్రల కోసం గతంలో కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పేర్లు కూడా వినిపించాయి. అలాగే, హీరోయిన్ పాత్ర కోసం మొదట దీపికా పదుకొణెను సంప్రదించినప్పటికీ, పారితోషికం, పనిగంటల వంటి అంశాల్లో విభేదాలు రావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
ప్రస్తుతం ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది. అయితే, మరో కీలక పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ను ఎంపిక చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
