
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన షాలిని కొండేపూడి (Shalini Kondepudi), ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతోంది.
కేవలం నటిగానే కాకుండా రైటర్ గా కూడా మంచి పట్టు ఉన్న ఆమె, తన తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ను సిద్ధం చేసినట్టు టాక్.
వస్తున్న వార్తల ప్రకారం షాలిని కొండేపూడి దర్శకత్వం వహించబోయే ఈ తొలి చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనుందట. కుటుంబ బంధాలు, మానవ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగాలు, దానికి తగిన వినోదాన్ని జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఆమె ఓ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్కు మహిళా దర్శకులు కొత్త కాదు. అప్పట్లో అగ్రనటి భానుమతి దర్శకత్వం వైపు అడుగులు వేసి ఆశ్చర్యపరచగా, ఆ తర్వాత విజయనిర్మల అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కారు. అలాగే సావిత్రి కూడా కొన్ని చిత్రాలను డైరెక్ట్ చేసి దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
ఈ కోవలోనే ఆ తర్వాత జీవితా రాజశేఖర్, సుధ కొంగర, నందిని రెడ్డి వంటి వాళ్లు దర్శకులుగా మారారు. ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పై కూడా విపరీతంగా చర్చ నడుస్తోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి షాలిని కొండేపూడి కూడా చేరబోతోందంట.
