
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan).
త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, మృణాల్ నాలుగేళ్ల కిందట నటించిన సినిమా ఇది.
మృణాల్తో పాటు హ్యూమా ఖురేషి (Huma Qureshi) కూడా నటించిన ఈ సినిమా, దాదాపు నాలుగేళ్ల పాటు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. తాము విడుదల చేయబోయే కొత్త కంటెంట్ జాబితాలో ఈ మూవీని కూడా చేర్చింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట జియో సినిమాలో నేరుగా విడుదల చేయాలని భావించినప్పటికీ, జియో, హాట్ స్టార్ విలీనం వల్ల ఈ సినిమా స్ట్రీమింగ్ లేట్ అయింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయి ఈ సస్పెన్స్ డ్రామా త్వరలోనే జీ5లో సందడి చేయనుంది.
నవజ్యోత్ గులాటి దర్శకత్వంలో 2022 నాటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, సుదీర్ఘ విరామం తర్వాత విడుదలవుతుండటంతో అందర్నీ ఆకర్షిస్తోంది. మృణాల్ నటన ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు.
పూజా అనే ఒక సాధారణ యువతి జీవితంలో జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఒక అజ్ఞాత వ్యక్తి ఆమెను ఎలా వేధించాడు, టెక్నాలజీ ద్వారా ఆమె జీవితంలోకి ఎలా చొరబడ్డాడు అనేది ఇందులో చూపించారు.
