
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) రిలీజ్ అవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సినిమాకు ఎ-సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి 18 ఏళ్ల లోపు పిల్లల్ని ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లకు అనుమతించవద్దని ఎగ్జిబిటర్లకు గట్టిగా చెప్పారు. ఇక టికెట్ రేట్లపై కూడా కఠినంగా ఉన్నారు. క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సి-సెంటర్లలో అనధికారికంగా టికెట్ రేట్లు పెంచుతుంటారు. ఈ సినిమాకు అలాంటి పనులు చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
ఈసారి ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఒక్కటే. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఏ చిన్న తప్పు జరిగినా, అది ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరం. అందుకే ఇలా టికెట్ రేట్ల విషయంలో, మైనర్లను అనుమతించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని మేకర్స్ నిర్ణయించారు.
తమిళనాడు అంతటా దాదాపు 950 స్క్రీన్లలో ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. తమిళనాట ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక యంత్రాంగంతో కలిసి నిర్మాతలు పర్యవేక్షిస్తున్నారు.
