
ఒకప్పుడు సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్ నమిత (Namitha). కానీ ఇప్పుడామె ఫ్యామిలీ లైఫ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. సినిమాలతో సందడి చేయడం తగ్గించింది. అయితే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనకు ఎదురైన ట్రోలింగ్, దాన్ని ఎదుర్కొన్ని విధానంపై స్పందించింది నమిత.
ఇన్స్టాగ్రామ్లో కొందరు నెటిజన్లు తనపై చేసిన అత్యంత దారుణమైన కామెంట్ల గురించి నమిత మాట్లాడింది. “నీ అమ్మ క్యాన్సర్ తో చనిపోవాలి.. నీ పిల్లలు, నువ్వు పెంచుకునే పెంపుడు జంతువులు కూడా చనిపోవాలి” అంటూ కొందరు క్రూరంగా ట్రోలింగ్ చేశారని ఆమె భావోద్వేగానికి లోనైంది.
జీవితంలో మొదటిసారి అలాంటి ఘోరమైన మాటలను ఎదుర్కొన్నప్పుడు, ఆ మానసిక బాధను తట్టుకోలేక చాలా రోజులు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె ఎమోషనల్ అయ్యారు.
ఇక గతంలో తను పాల్గొన్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోపై వస్తున్న ట్రోల్స్ గురించి కూడా నమిత గట్టిగా స్పందించింది. హౌస్లో జరిగే చిన్న చిన్న విషయాలను జనాలు మరీ ఓవర్గా జడ్జ్ చేస్తున్నారని మండిపడింది. రోజులో 24 గంటలు జరిగే రియాలిటీని వదిలేసి, టీవీలో కేవలం ఒకటిన్నర గంటల పాటు చూపించే ఎడిటెడ్ ఎపిసోడ్ను మాత్రమే చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం అస్సలు సరికాదని హితవు పలికింది నమిత.
తనపై వచ్చే ఎలాంటి ట్రోల్స్ నైనా భరించే ఓపిక ఇప్పుడు తనకు వచ్చిందంటోంది నమిత. కానీ తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది. “నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా స్నేహితులను ఇందులోకి లాగితే నేను అస్సలు సహించను” అని ఆమె స్పష్టం చేసింది.
