
‘పెద్ది’ (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు చాలామంది హీరోయిన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రం చుట్టూ అల్లుకున్న ఈ వివాదం ఈ హీరోయిన్ల వల్ల రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పుడీ విమర్శల పరంపరలోకి కంగనా కూడా చేరింది.
సినిమాల్లో మహిళలను కేవలం ఒక వస్తువులా చూపించే ధోరణిపై కంగనా స్పందించింది.సాధారణంగా తను ఒక సినిమాకు అంగీకరించినప్పుడు రకరకాల కోణాల్లో ఆలోచిస్తానని, ఎక్కడైనా తేడా కొడితే “ఇది ఇలా అనిపిస్తోంది” అని దర్శకులకు ముందే చెప్తానని అంటోంది కంగనా.
అయితే ఇదే టైమ్ లో మేకర్స్ ను కూడా వెనకేసుకొచ్చింది కంగనా. ఏ దర్శకుడూ కావాలని మహిళలను తక్కువ చేసి చూపించడానికి సినిమాలు తీయరని ఆమె అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో చిత్రనిర్మాతలతో మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడింది.
చాలా మంది పురుష రచయితలు కథ రాసుకున్నప్పుడు, మహిళా కోణంలో దాన్ని ఆలోచించలేకపోవచ్చని.. ఓ మహిళగా మన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినప్పుడు… “మేము ఈ కోణంలో ఆలోచించలేదు, మీరు చెప్పింది నిజమే” అని వారు కూడా ఒప్పుకుంటారని అంటోంది కంగన. చూస్తుంటే, తప్పంతా జాన్వీదే అన్నట్టున్నాయి కంగనా వ్యాఖ్యలు.
