
తమిళ సూపర్ స్టార్ విజయ్ “జన నాయగన్” (జన నాయకుడు) సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” చిత్రానికి రీమేక్ అని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు అది నిజం అని తేలింది.
“జన నాయగన్” నుంచి మొదటి పాట విడుదలయింది. ఇందులో విజయ్ హీరోగా అతని లవర్ గా పూజ హెగ్డే కనిపించారు. ఇక తెలుగులో శ్రీలీల చేసినటువంటి పాత్రని మమిత బైజు చేస్తోంది. “భగవంత్ కేసరి”లో “ఇచ్చి పాడు”పాట స్థాయిల్లోనే ఈ జన నయగన్ పాట ఉంది. తెలుగులో ఆ పాటలో బాలయ్య, కాజల్, శ్రీలీల డ్యాన్స్ చెయ్యగా, ఈ పాటలో విజయ్, పూజ, మమిత చేశారు. దీంతో ఇది రీమేక్కే అనేది కన్ఫర్మ్ అయింది.
బహుశా “జన నాయగన్” అతనికి హీరోగా చివరి చిత్రం అవుతుందేమో. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ TVK (Tamilaga Vettri Kazhagam)ని బరిలో నిలుపుతున్నాడు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాడు. మొత్తం అన్ని స్థానాలకు అతని పార్టీ పోటీ చేస్తుంది. గెలిచినా, ఓడినా తాను ఇక సినిమాలు చెయ్యను అని విజయ్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
అందుకే ఇదే అతని చివరి చిత్రం అని అంటున్నారు. ఈసారి తన పార్టీ అధికారం చేజిక్కించుకోకపోయినా 2031కి తమిళనాడు సీఎం కావాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు విజయ్. అందుకే, ఈ సినిమాపై తమిళనాడులో చాలా క్రేజ్ ఉంది. తన రాజకీయాలకు అనుగుణంగా తన చివరి చిత్రం ఉండాలనే ఉద్దేశంతో “భగవంత్ కేసరి” చిత్రం కథని విజయ్ కొన్నాడు అని అంటున్నారు.





