
బాలీవుడ్ నటి కాజోల్ ని తెలుగులో నటింప చేసేందుకు పలువురు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఆమెని ఇప్పటికే దర్శకుడు సందీప్ వంగా సంప్రదించాడు. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న “స్పిరిట్” సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంలో వార్తలు వచ్చాయి. కానీ టీం ఇంతవరకు కన్ఫరమ్ చెయ్యలేదు.
మరోవైపు, ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న “డ్రాగన్” చిత్రంలో కూడా ఒక కీలక పాత్రకు కాజోల్ ని తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఒప్పుకుంటుందా అనేది చూడాలి.
ప్రశాంత్ నీల్ ఇంతకుముందు తాను తీసిన “కేజీఎఫ్” చిత్రాల్లో రవీనా టాండన్ కి కీలక పాత్ర ఇచ్చారు. “సలార్”లో శ్రీయా రెడ్డికి ప్రధానమైన పాత్ర ఇచ్చారు. ఇప్పుడు మరో కీలక పాత్రకు ఒక పేరున్న పాతకాలపు హీరోయిన్ కావాలని అనుకుంటున్నారట. అలా కాజోల్ ని తీసుకోవాలనే ఆలోచన వచ్చిందట.
కాజోల్ ఇప్పటికీ బాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తోంది. ఆమె గతంలో తమిళ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఐతే, తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా “కథ, పాత్ర నచ్చితే చేస్తాను” అని కాజోల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మరి ఆమె ఇప్పుడు ఈ రెండు తెలుగుసినిమాలు సైన్ చేస్తుందా అనేది చూడాలి.
