ఆచార్య వివాదం ముగిసిందా?

TeluguCinema 01 Sep 2020
Chiranjeevi

“ఆచార్య” కథ నాది అంటూ ఒక అప్ కమింగ్ రైటర్ రాజేష్… పెద్ద దుమారాన్నే రేపాడు. తను రాసుకున్న కథని మైత్రి సంస్థ కొరటాలకి అప్పచెప్పిందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆటను చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. మెగాస్టార్ చిరంజీవి కలగచేసుకొని తనకు న్యాయం చెయ్యాలని వేడుకున్నాడు.

ఐతే, అతని మాటల్లో నిజం లేదని కొరటాల, మైత్రి సంస్థలు ప్రకటించాయి. కొరటాల ఏకంగా అతనిపై లీగల్ చర్యలు తీసుకుంటా అని చెప్పాడు. రెండు రోజులు సాగిన వివాదం ఇప్పుడు ముగిసినట్లు కనిపిస్తోంది. ఐతే, మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో కలుగచేసుకుంటారట. కానీ అది ఇప్పుడు కాదు. ఈ మ్యాటర్ మొత్తం చల్లబడ్డాక అసలు విషయమేంటో గ్రహించి… దాన్ని బట్టి తన చర్యలు తీసుకుంటారట.

ప్రస్తుతానికి మంటలు చల్లబడ్డట్లున్నాయి. రాజేష్ కూడా మళ్ళీ దీనిపై మీడియాలో మాట్లాడడం లేదు.

“ఆచార్య” సినిమాలో చిరంజీవి హీరో. భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడే కామ్రేడ్ పాత్రలో మెగాస్టార్ కనిపిస్తారట. రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాటినీ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.