
బెంగుళూరు నిర్మాతతో సంబంధాలు, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తనీష్ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో హీరో తనీష్ స్పందించాడు. తన వర్షన్ ఏంటో, అసలు జరిగింది ఇది అంటూ ఒక వీడియో విడుదల చేశాడు.
“బెంగుళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజం. ఈ కేసులో నాకు వచ్చిన నోటీసుకు కారణం వేరు. ఫలానా వివరం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి!
అని మాత్రమే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యానని నోటీస్ పంపలేదు.. ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారం కథనాలు అల్లేశాయి. నేను నా కుటుంబం చాలా కలతకు గురయ్యాం. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయొద్దు,” అని ఈ వీడియో ద్వారా చెప్పాడు.
“ఆ బెంగళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గతంలో సంప్రదించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. రెండేళ్లుగా ఆయనతో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. అవకాశాల కోసం ఎందరినో కలుస్తుంటాం. అభ్యర్థిస్తుంటాం. కానీ ఆయనతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. దయచేసి అసత్యాలు ప్రచారం చేయొద్దని,” కోరారు తనీష్.