
ఎల్.విజయలక్ష్మి ఒకప్పుడు అనేక సినిమాల్లో నటించారు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల ఆమెకి ఎన్టీఆర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమవారంనాడు హైదరాబాద్లో ఆమెని నందమూరి బాలకృష్ణ సన్మానించారు.
జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించిన తార… ఎల్. విజయలక్ష్మి.
“శకపురుషుడి శతాబ్డి పురస్కార గ్రహీత ఎల్. విజయలక్ష్మిగారికి శిరస్సు వచ్చి వందనాలు సమర్పిస్తున్నాను. వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. నటీనటులు ఒక స్థాయికి చేరుకున్నాక సినీ ప్రయాణం ఆగిపోతే ఒంటరితనానికి గురికావడం సహజం. కానీ ఆమె నాన్నగారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చదివి వర్జీనియా యూనిర్శిటీలో బడ్జెట్ మేనేజర్గా వుండడం.చాలా విశేషం. ఇప్పుడు జూంబా డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మనిషికి పనిలేకుండా ఖాళీగా వుంటే రోగం. ఆమె మహిళా సాధికారికతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లును భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి” అన్నారు నందమూరి బాలకృష్ణ.
“నేను చిన్నతనంనుంచి రామారావుగారిని ఆదర్శంగా తీసుకునేదానిని. ఆయనతో నటించేటప్పుడు మొదట చాలా భయమేసేది. పెద్ద హీరో అని ఫీలింగ్ ఉండేదికాదు. ఆయనతో నటించేటప్పుడు చాలా విలువలు నేర్చుకున్నాను. క్రమశిక్షణ, మాటతీరు, సిన్సియారిటీ, చెప్పిందే చేయడం, అంకిత భావం, నిబద్ధత వంటి విషయాలు గ్రహించాను. సినిమాలు అయ్యాక నేను ఎడ్యుకేషన్ చేశానంటే ఎన్.టి.ఆర్.స్పూర్తి వల్లే జరిగింది,” అన్నారు విజయలక్ష్మి.