
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ట్రేడ్ వర్గాల్లో ఒక క్రేజ్ ఉంది. ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సినిమా రూపొందుతోంది. ఐతే, ఈ సినిమాకి అనేక అవాంతరాలు, కష్టాలు ఎదురవుతున్నాయి. తాజాగా, ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్తిపాడు కోర్టు ఈ వారెంట్ని జారీ చేసింది.
కొన్నాళ్ల క్రితం రవీందర్ రెడ్డి నాగ చైతన్య హీరోగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా కోసం తీసుకున్న 50 లక్షలు తిరిగి చెల్లించట్లేదని ప్రత్తిపాడుకి చెందిన వ్యక్తి వేసిన కేసులో ఇంతకుముందు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఐతే, కోర్టు ఆదేశాల్ని మిర్యాల రవీందర్రెడ్డి ఖాతరు చెయ్యలేదు. దాంతో ఈసారి నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చి పడింది. ఇది పెద్ద ట్రబుల్.
దాంతో బోయపాటి వర్రీ అవుతున్నాడట. ఈ సినిమా విడుదలకు ముందే ఏ సమస్యలున్నా…. అవన్నీ క్లియర్ చేసుకోవాలని బాలయ్య నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డికి అల్టిమేటం ఇచ్చాడట. లేదంటే తీరా విడుదల రోజు సినిమాకి క్లియరెన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇటీవల నిర్మాత ఠాగూర్ మధు ఇలాంటి గిమ్మిక్కులు చెయ్యడంతో ‘క్రాక్’ సినిమా మొదటిరోజు విడుదల కాలేదు. అందుకే, ఇప్పుడు హీరోలు మేలుకుంటున్నారు.