
నిర్మాత బన్నీ వాసు కొంతకాలంగా ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నారు. నటి సునీత బోయ ఆయనఫై రెండు, మూడేళ్ళుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు ఆమె ఆరోపణలను తిప్పికొట్టారు. ఐతే, తాజాగా ఆమె జనసేన పార్టీ కార్యాలయం ముందు ధర్నా చెయ్యడంతో బన్నీ వాసు మరోసారి స్పందించక తప్పలేదు.
గతంలోనే ఆమెపై కేసు పెట్టారు బన్నీ వాసు. తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు.
“సునీత బోయ చేసిన ఏ ఆరోపణ తీసుకున్నా కూడా నిరాధారంగా.. అలాగే ఒకదానితో మరోటి సంబంధం లేకుండా ఉన్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఆమె పోస్ట్ చేసిన అన్ని వీడియోలను చూస్తే ఈ విషయం మీకే అర్థమైపోతుంది. పరిస్థితులకు తగ్గట్లు.. తను ముందు అన్న మాటనే మళ్లీ మార్చి చెప్పడం సునీత బోయకు అలవాటు. ఆమె తప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ కూడా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా ఆమె మాటలు వింటే ఎంత వరకు నిజాలు చెప్తుందో తెలిసిపోతుంది.
దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని మనవి. లైమ్ లైట్లో ఉండటానికి ఈమె చేసే తప్పుడు ఆరోపణలను మీడియా ఎలాంటి కథనాలను కూడా ప్రచురించవద్దని హృదయపూర్వక విన్నపం, ” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు
ఆమెపై వేసిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉందట. “తీర్పు వచ్చిన తర్వాత కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని వివరిస్తాను,” అని అంటున్నారు బన్నీ వాసు.