
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రాణించాలని 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి …సినిమాలను వదిలేశారు. దాదాపు 8 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ ‘ఖైదీ నెంబర్ 150’తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
రాజ్యసభ పదవీకాలం కూడా పూర్తయ్యాక ఆయన మది నుంచి రాజకీయాల ఆలోచన పక్కకు వెళ్ళింది. ఐతే, ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ పార్టీ చిరంజీవిని తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన పొలిటికల్ రెండో ఇన్నింగ్స్ గురించి ఇటీవల చాలా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఇంకోసారి సినిమాలను వదిలేసే ప్రసక్తే లేదు అంటున్నారు చిరంజీవి.
“ఒక మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ స్థాయి వరకు ఎదగటానికి కారణం సినిమా తల్లి. ఈ చిత్రసీమకే నేను రుణపడి ఉంటాను. ఇంత అభిమానం, ప్రేమ, గౌరవం సినిమాల వల్లే పొందాను. సినిమాలు ఎప్పటికీ వదలను,” అని చిరంజీవి అన్నారు.
53వ ఇఫీ ముగింపు ఉత్సవాల్లో ఆయన ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ’ పురస్కారం పొందారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పారు. ఇక రాజకీయాలకు దూరం అని ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారు.