
“12 మెట్ల కిన్నెర”పై స్వరాలు పలికించే అరుదైన కళాకారుడు దర్శనం మొగులయ్య. 12 మెట్ల కిన్నెర అనే సంగీత వాయిద్య పరికరంతో స్వరాలను పలికించే ఈ కళకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ అది అంతరించిపోతోంది ఇప్పుడు. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం తన కళని ప్రదర్శించారు మొగులయ్య.
‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ లో అడవిలో కూర్చొని పాటే పాడే కళాకారుడు ఆయనే. సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్నిపలికించిన దర్శనం మొగులయ్య పేదరికంలో మగ్గుతున్నారు.
ఆయనని తన సినిమాలో పాడించడమే కాకుండా తాజాగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు పవన్ కళ్యణ్.
“తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన శ్రీ మొగులయ్య గారు 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన శ్రీ పవన్ కల్యాణ్ గారిలో ఉంది. శ్రీ మొగులయ్య గారు కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. ఆయనకు ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు అందించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును శ్రీ మొగులయ్య గారికి అందచేస్తారు,” అని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.