
హీరోలంతా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. నాగచైతన్య, నాగార్జున, సాయితేజ్.. ఇలా అంతా తమ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఈ విషయంలో మొన్నటివరకు తహతహలాడిన “ఫైటర్” యూనిట్ మాత్రం ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు.
ముంబైలోనే తీయాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇక రామోజీ ఫిలింసిటీలోనే కానిచ్చేస్తారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ముంబయిలోనే మళ్లీ స్టార్ట్ అవుతుందని చార్మి గతంలో చెప్పినప్పటికీ ప్రస్తుతం ముంబయిలో అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ని. సుశాంత్ మరణం తర్వాత అతడు అతన్ని ఒక వర్గం బాగా టార్గెట్ చేసింది. దాంతో కరణ్ సైలెంట్ అయ్యాడు.
ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న అనన్యపాండే ఓ నెపోకిడ్. ప్రస్తుతం బాలీవుడ్ లో నెపోకిడ్స్ పై ఉన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు. ఇలాంటి టైమ్ లో అనన్య పాండేతో ముంబైలో షూటింగ్ మొదలు పెడితే సమస్యలు వస్తాయేమోనని యూనిట్ భావిస్తోంది. ఈ కారణాల వల్ల ఫైటర్ సినిమా ఇంకా సెట్స్ పైకి రావట్లేదు.
త్వరలోనే దీనిపై పూరి-కరణ్ కలిసి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట. స్పీడ్ గా ఫినిష్ చేద్దామనుకున్న పూరికి అటు కరోనా, ఇటు సుశాంత్ మరణం తర్వాత జరిగిన రగడతో చాలా గ్యాప్ పెరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండ కూడా గప్ చుప్ గా ఉన్నాడు.