ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో అనేక ఏళ్ళు నంది అవార్డులు ఇచ్చారు. తెలుగు సినిమా రంగంలో అందరూ నంది అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావించేవారు. రాష్ట్ర విభజన తర్వాత విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్థులు ఇస్తామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఆ స్థానంలో మరో అవార్డులు ఇవ్వాలని అనుకున్నా ఆ తర్వాత ప్రతిపాదనని విరమించుకొంది.
ఇక చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనలో చివరి దశలో నంది అవార్డులను ప్రకటించింది కానీ వాటిని ప్రదానం చెయ్యలేదు. ఆ తర్వాత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడంతో నంది అవార్డుల ప్రకటన మర్చిపోయారు.
తాజాగా తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తెలుగు సినిమా ప్రతినిధులు కొంతమంది వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నంది అవార్డులు ఇవ్వాలని కోరారు. దాంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆలోచన చేస్తోంది.
“నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వబోతున్నాం. త్వరలోనే దీనికి సంబందించిన జీవో జారీ చేస్తాం,” అని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.