గుణశేఖర్ శాపం… రానా మౌనం!

- Advertisement -
Gunasekhar and Rana


“రుద్రమదేవి” విడుదల తర్వాత దర్శకుడు గుణశేఖర్ “హిరణ్యకశ్యప” అనే సినిమా ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. రానాని హీరోగా అనుకున్నారు. “రుద్రమదేవి”లో రానా ఒక పాత్ర కూడా పోషించారు కదా. అందుకే, రానా హీరోగానే “హిరణ్యకశ్యప” సినిమా ప్లాన్ చేశారు గుణశేఖర్. ఐతే, ఈ సినిమాకి అనుకున్న భారీ బడ్జెట్ తో రానా హీరోగా నిర్మించేందుకు నిర్మాతలు వెనుకడుగు వేశారు.

ఆ సమయంలో రానా తండ్రి సురేష్ బాబు ముందుకొచ్చి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ప్లాన్ చేశారు. కానీ రానాకి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యారు. దాంతో, గుణశేఖర్ “శాకుంతలం” అనే సినిమాని చేపట్టారు. దిల్ రాజు ఇచ్చిన ఫండింగ్ తో సమంత హీరోయిన్ గా గుణశేఖర్ “శాకుంతలం” తీసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ సినిమా ఎంత దారుణ పరాజయం పాలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దిల్ రాజుకి దాదాపు 15, 20 కోట్ల రూపాయల నష్టం వచ్చింది “శాకుంతలం” వల్ల. దాంతో, రానాకి అర్థమైంది గుణశేఖర్ నేటితరం గ్రాఫిక్స్, టెక్నాలజీని సరిగా ఉపయోగించలేరు అని. ఆయనది అంతా పాతకాలపు భారీ సెట్స్ తో కూడిన ప్రతిభ అని రానా అర్థం చేసుకున్నారు. అందుకే, రానా గుణశేఖర్ ని పక్కన పెట్టి త్రివిక్రమ్ తో స్క్రిప్ట్ రాయించుకున్నారు. త్వరలోనే “హిరణ్యకశ్యప” సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తామని ఇటీవల రానా ప్రకటించారు.

రానా ప్రకటనలో గుణశేఖర్ పేరు ఎక్కడా లేదు. దర్శకుడు పేరు అసలు ప్రస్తావించలేదు రానా.

Hiranyakashyap

దాంతో వెంటనే గుణశేఖర్ ట్విట్టర్ వేదికపై రానాకి శాపనార్థాలు పెట్టారు. “దేవుడి మీద సినిమాలు తీస్తున్నప్పుడు దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు తెలుసుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది,” అంటూ గుణశేఖర్ ట్వీట్ చేశారు.

గుణశేఖర్ ఇలా ఇన్ డైరెక్ట్ గా రానాని టార్గెట్ చేసి ట్వీట్ వేసి ఒక రోజు గడిచిపోయింది. కానీ రానా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మౌనం పాటిస్తున్నారు రానా. “శాకుంతలం” సినిమా చూసిన తర్వాత గుణశేఖర్ తో సినిమా చేసేందుకు, తీసేందుకు ఎవరూ ధైర్యం చెయ్యడం లేదనేది కఠోర వాస్తవం.

More

Related Stories