దర్శకుడు త్రివిక్రమ్ కి రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి నవలలు అంటే విపరీతమైన అభిమానం. ఆమె రచనాశైలిని ఆయన బాగా ఇష్టపడుతారు. ఇప్పటికే ఆమె రాసిన “మీనా” నవల ఆధారంగా “అ ఆ” అనే సినిమా తీసి విజయం సాధించారు. ఇప్పుడు “గుంటూరు కారం” సినిమాని “కీర్తికిరీటాలు” అనే నవల ఆధారంగా తీశారు అని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి.
తాజాగా విడుదలైన “గుంటూరు కారం” ట్రైలర్ ని బట్టి చూస్తే ఆ నవల స్ఫూర్తి ఉందని కచ్చితంగా చెప్పొచ్చు.
కీర్తికిరీటాలు కథ ఎలా మొదలవుతుంది అంటే…
సంగీత ప్రపంచంలో ఎనలేని పేరు తెచ్చుకున్న రాజ్యలక్ష్మి కొన్నేళ్లు అమెరికాలో ఉండి వస్తారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో తన పెంపుడు కొడుకు కిషోర్ తో నివసిస్తూ ఉంటారు. తన డ్రైవర్ కి ఒక లెటర్ ఇచ్చి విజయవాడ సమీపంలోని విద్యాపురం అనే ఊళ్ళో ఉంటున్న ఒక “కుర్రాడి”కి అది ఇచ్చి అక్కడ నుంచి సమాధానం ఏంటో కనుక్కొని రమ్మని చెప్తోంది ఆవిడ. ఆ డ్రైవర్ ఊరికి వెళ్తుండగా కథ మొదలవుతుంది. స్థూలంగా కథ ఏంటంటే రాజ్యలక్ష్మి తన కొడుకు తేజని 8వ ఏట వదిలి వెళ్తుంది. ఆ బాబు తన తాతయ్య దగ్గర పెరుగుతాడు.
ఇప్పుడు ఆ కొడుకుని చూడాలనేది ఆమె ఆరాటం. తన స్నేహితురాలి కూతురు స్వర్ణతో తేజకి పెళ్లి చేయించి తన ఆస్తిని అంతా ఇచ్చి తన తప్పుని సరిచేసుకోవాలని అనుకుంటుంది. కానీ కొడుకు తేజ ఆమెని చూసేందుకు వస్తాడా?
“గుంటూరు కారం” ట్రైలర్ లో తల్లి తన కొడుకు చేతిని వదిలి వెళ్తున్న ఫ్లాష్ బ్యాక్ తో మొదలైయింది. తేజ ఇక్కడ రమణ గాడు అయ్యాడు. రమ్యకృష్ణ తల్లి పాత్ర. పెంపుడు కొడుకు కిషోర్ పాత్రని రాహుల్ రవీంద్రన్ పోషించినట్లు కనిపిస్తోంది. ఐతే, అక్కడ సంగీత ప్రపంచం, ఇక్కడ రాజకీయాల నేపథ్యం.
“కీర్తి కిరీటాలు” కథని ఒక పెద్ద హీరోకి ఎలా కమర్షియల్ గా చెయ్యాలో అలా త్రివిక్రమ్ మలిచినట్లు కనిపిస్తోంది.