
దేశమంతా తెలుగు దర్శకులదే హవా. భారతీయ సినిమా రంగానికి కేంద్రబిందువుగా మారుతోంది తెలుగుచిత్రసీమ. బాలీవుడ్ కి వెళ్లి మన దర్శకులు సత్తా చూపుతున్నారు అలాగే, తమిళంలో కూడా మన వాళ్ళ సందడి మొదలైంది. హేమంబర్ జాస్తి దర్శకత్వం వహించిన ‘కేరాఫ్ కాదల్’ మంచి విజయం సాధించింది. తెలుగులో విజయం సాధించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకి రీమేక్ ఇది.
హేమంబర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్టర్గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. మంచి కథాబలమున్న సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఇన్నాళ్లూ ఆగారు.
‘కేరాఫ్ కంచెరపాలెం’ను తమిళంలో రీమేక్ చేయమని ఆఫర్ రావడంతో ఓకే చెప్పారు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 12న తమిళనాట విడుదలైన ‘కేరాఫ్ కాదల్’ సినిమాపై ప్రేక్షకులు ప్రేమ వర్షం కురిపించారు. విమర్శకులు సినిమాను ప్రశంసించారు. ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో టాప్ 20 లిస్టును ప్రముఖ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అందులో ‘కేరాఫ్ కాదల్’ చోటు దక్కించుకుంది. ఈ ఏడాది విడుదలైన టాప్ సినిమాల్లో ‘కేరాఫ్ కాదల్’ ఒకటి తమిళ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హేమంబర్ జాస్తి డైరెక్షన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు.
తెలుగు నిర్మాతల నుంచి తెలుగులో సినిమా తీయమని హేమంబర్ జాస్తికి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కుదిరిన తర్వాత కొత్త సినిమా వివరాలను నిర్మాణ సంస్థ వెల్లడించనుంది.