‘ఆదిత్య 999’ డైరెక్ట్ చేస్తా: బాలయ్య

Balakrishna


‘ఆదిత్య 369’ సీక్వెల్ గురించి ఇప్పటికే చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ, ఆ సినిమా ఇప్పటివరకు మొదలుకాలేదు. ఈ సినిమా గురించి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు.

“ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 తీస్తా. నేనే డైరెక్ట్ చేస్తాను. వచ్చే ఏడాది మొదలవుతుంది,” అని బాలయ్య తెలిపారు. విశ్వక్ సేన్ తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’ సినిమా మొదటి ట్రైలర్ ని బాలయ్య లాంచ్ చేశారు. కుర్ర హీరో డైరెక్టర్ గా సినిమా తీయడంతో అదే వేదికపై తన డైరెక్షన్ లోనే ‘ఆదిత్య 999’ ఉంటుందని బాలయ్య ప్రకటించారు.

బాలకృష్ణ కెరీర్ లో ఒక క్లాసిక్ గా మిగిలింది ‘ఆదిత్య 369’. ఆ సినిమాకి ఎందరో అభిమానులు. సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాకి సీక్వెల్ తీయాలన్న ఆలోచన చాలాకాలంగా ఉంది. ఈ సినిమాలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ నటిస్తారని కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది.

ఇక బాలయ్య గతంలోనే డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నించారు. ‘నర్తనశాల’ రీమేక్ ని లాంచ్ చేశారు 17 ఏళ్ల క్రితం. కానీ, ఆ సినిమా ఆగిపోయింది. సో, బాలయ్య… డైరెక్షన్ చెయ్యాలన్న తన కలని ‘ఆదిత్య 999’తో తీర్చుకునే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories