అనారోగ్యం వార్తలపై కృష్ణంరాజు వివరణ

TeluguCinema 14 Sep 2021


సీనియర్ నటుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయన హడావిడిగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. దాంతో, కృష్ణంరాజు వివరణ ఇచ్చారు. రెగ్యులర్ చెకప్ కోసమే అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చారు.

“ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చారు. అక్కడే ఉన్న సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుగుసుకున్నారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు చెప్పారు. దయచేసి తప్పుడు వార్తలు ప్రసారం చెయొద్దు.” – ఇది కృష్ణంరాజు టీం మీడియాకి పంపిన వివరణ.

కృష్ణంరాజుకిప్పుడు 81 ఏళ్ళు. గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకి గవర్నర్ పదవి దక్కనుందని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమి ఇప్పటివరకు కాలేదు.

ప్రస్తుతం ఆయన తన సోదరుడి కుమారుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణంరాజు కూతురు ప్రసీద ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నారు.