కరోనా టైంలో ఇలా చెయ్యాలి!

పుష్ప, ఆచార్య, రాధేశ్యామ్… ఇలా ఇటీవల పెద్ద సినిమాల షూటింగ్ లలో అనేక కరోనా కేసులు బయటపడ్డాయి. ‘ఆచార్య’ షూటింగ్ లోనే హీరోయిన్ పూజా హెగ్డే, సోను సూద్ కరోనాకి పాజిటివ్ అని తేలింది. ‘పుష్ప’ షూటింగ్ లో అల్లు అర్జున్ కి వచ్చింది. ప్రభాస్ తో పనిచేస్తున్న పలువురు టీం మెంబర్స్ కి, వకీల్ సాబ్ ప్రొమోషన్ లో పాల్గొన్న హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ నివేధా థామస్ కి కరోనా వచ్చింది. ఈ లిస్ట్ పెద్దదే.

ఐతే, కరోనా టైంలో కూడా షూటింగ్ చేసి కేసులు రాకుండా బయటపడ్డ టీమ్స్ కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది.. ‘లవ్ స్టోరీ’. దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుచూపుతో వ్యవహరించారట.

“షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రెండు రోజుల ముందే ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా టెస్ట్ లు నిర్వహించేవారు. ఫలితం నెగిటివ్ వస్తేనే చిత్రీకరణకు అనుమతించారు. యూనిట్ అందరికీ శానిటైజర్లు, మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ లు కూడా ఇచ్చారు. ప్రతి రోజూ గుడ్లు, పాలు, పండ్లు అందజేశారు. జాగ్రత్తలు తీసుకుంటూనే బౌన్సర్లతో సహా మొత్తం 24 క్రాఫ్టులలోని యూనిట్ మెంబర్స్ 95 మందికి కొవిడ్ ఇన్యూరెన్స్ చేయించారు,” అని లవ్ స్టోరీ టీం తెలియచేసింది. షూటింగ్ మొత్తంలో ఒక్కరూ కూడా కరోనా బారిన పడలేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ లు రద్దు చేసుకోవడమే బెటర్. తప్పనిసరి అనుకుంటే.. శేఖర్ కమ్ముల తీసుకున్న జాగ్రత్తలు పాటించాలి. లవ్ స్టోరీ’లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు.

Advertisement
 

More

Related Stories