మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ పురస్కారం వెనుక రాజకీయ మతలబు ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి బీజేపీ తరఫున నిలబడడం కానీ, ప్రచారం చెయ్యడం కానీ చేస్తారని అన్నారు. కానీ అది నిజం కాదని తాజాగా ప్రూవ్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన దూరమే. ఏ పార్టీకి ప్రచారం చెయ్యబోవడం లేదనేది ఫిక్స్.
ఆయన మార్చి, ఏప్రిల్ నెలలో షూటింగ్ ని పెట్టుకున్నారు. “విశ్వంభర” సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్. ఈ రెండు నెలలు షూటింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో పుకార్లకు చెక్ పెట్టొచ్చనేది ప్లాన్.
మెగాస్టార్ చిరంజీవి సోదరులు ఇద్దరూ ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఈసారి ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని అంచనా. జనసేన – తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ వీరితో కలుస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు.
ఐతే, మెగాస్టార్ చిరంజీవి అటు బీజేపీతో కానీ, ఇటు తమ్ముడు పార్టీతో కానీ అసోసియేట్ అవ్వాలని అనుకోవడం లేదు. అన్ని రాజకీయ పార్టీ అధినేతలందరితో మెగాస్టార్ కి మంచి స్నేహాలు ఉన్నాయి. అవి అలాగే కంటిన్యూ చేస్తూ అందరివాడిలా కొనసాగాలి అనుకుంటున్నారు మెగాస్టార్.