
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘వాల్తేర్ వీరయ్య’తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం, ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల అవుతుంది.
ఆ తర్వాత ఆయన మరో రెండు సినిమాలు ఒప్పుకునే పనిలో ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ మంచి కథతో వస్తే సినిమా చేస్తాను అని ఆ మధ్య చిరంజీవి ప్రకటించారు. కానీ, ఎందుకో పూరికి ఓకే చెప్పలేదు. అసలు పెద్ద దర్శకులతో సినిమాలు చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపడం లేదు.
స్టార్ డైరెక్టర్లతో ఇక సినిమాలు వద్దు అనుకుంటున్నారు మెగాస్టార్. మీడియం రేంజ్, అప్ కమింగ్ డైరెక్టర్స్ చాలు అనేది ఆయన పాలసీ. పెద్ద దర్శకులు తన అనుభవాన్ని పట్టించుకోరని, వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారని చిరంజీవి భావన. సురేందర్ రెడ్డి (సైరా), కొరటాల శివ (ఆచార్య)లతో పని చేశాక ఇక స్టార్ డైరెక్టర్లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట.
ప్రస్తుతం ఆయన ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ మల్లిడి వంటి వారితో చర్చలు జరుపుతున్నారు. మరో ఇద్దరు యువ దర్శకులకి కూడా కథలు వినేందుకు టైం ఇచ్చారట.