
సీనియర్ నటి పావలా శ్యామల కొంతకాలంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో ఆమె కష్టాలు తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి 2 లక్షలు రూపాయలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకి నెలా నెలా పెన్షన్ అందిస్తోంది. ఐతే గత మూడు నెలలుగా పెన్షన్ డబ్బులు అందడం లేదట. ప్రస్తుతం ఆమె కష్టాలు మరింతగా పెరిగాయని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆమెకి ఆర్థిక సాయం అందించారు.
1,01,500 రూపాయల చెక్ ని ఆమెకి ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వ కార్డ్ నిమిత్తం ఈ మొత్తాన్ని వాడుతారు. ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ తో ఆమెకి నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ రూపంలో ఇస్తోంది. అలాగే ఎవరైనా ఆర్టిస్ట్ అకాలమరణం చెందితే వారికి 3 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది.
“చిరంజీవి గారు 2 లక్షల ఆర్థిక సాయం చేసినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు నేను ఎంతో కష్టంలో ఉన్నాను. తీవ్ర మానసిక వేదనను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించలేని పరిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం నన్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఈ కష్టకాలంలో మరోసారి లక్షా పదిహేను వందల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చి, ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయపడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధన్యవాదాలు,” అని అన్నారు పావలా శ్యామల.