
మలయాళ నటులకు తెలుగులో డిమాండ్ పెరుగుతోంది. సహజమైన నటనకి పెట్టింది పేరు మలయాళ నటులు. ఇప్పటికే సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగులో రెండు సినిమాలు చేశారు. మరో లెజెండరీ స్టార్ మమ్మూట్టి మరోసారి తెలుగులో నటిస్తున్నారు. అఖిల్ హీరోగా రూపొందుతోన్న ‘ఏజెంట్’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ ‘మహానటి’తో తెలుగులోకి అడుగుపెట్టాడు. తాజాగా హీరోగా మరో తెలుగు మూవీ చేస్తున్నాడు దుల్కర్. మరో అగ్ర మలయాళ కథానాయకుడు ఫహద్ ఫాజిల్ ఇటీవలే ‘పుష్ప’లో నటించారు. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్, ఫహద్ మధ్య సన్నివేశాలు హైలెట్ కానున్నాయి.
ఇప్పుడు మరో అగ్ర మలయాళ హీరో కూడా తెలుగు బాట పడుతున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ విషయాన్నీ ప్రభాస్ స్వయంగా చెప్పాడు.
పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో విలన్ గా నటిస్తారా లేక ఏదైనా కీలక పాత్రనా అన్నది చూడాలి.