మరో లాయర్ సుహాసిని!

Rashi Khana in Pakka Commercial

ఇటీవల తెలుగులో లాయర్ పాత్రలకి క్రేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. పోలీస్ పాత్రలు క్రియేట్ చేసి చేసి ఫిలింమేకర్స్ బోర్ ఫీలవుతున్నారు కాబోలు. అందుకే లాయర్ పాత్రలని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు నల్ల కోటు ధరించి కోర్టులో వాదించే సీన్లు ఎక్కువయ్యాయి. ‘వకీల్ సాబ్’గా హీరోలు అదరగొడుతుంటే… ‘లాయర్ సుహాసిని’ పాత్రల్లో హీరోయిన్లు కనిపిస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు మూడు సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు లాయర్ పాత్రల్లో కనిపించారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ న్యాయవాది. సినిమా హిట్టయింది. వరలక్ష్మికి కూడా పేరొచ్చింది.

సూపర్ డూపర్ హిట్టయిన ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ లా స్టూడెంట్. సినిమాలో చివర్లో నల్లకోటు వేసుకొని వాదిస్తుంది. ఆమెకి, జడ్జి బ్రహ్మానందంకి మధ్య సాగే మాటలు బాగా నవ్వించాయి. కొత్త భామ ఫరియా అబ్దుల్లా ఈ పాత్ర పోషించింది.

అలాగే, ‘చెక్’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గానే కనిపించింది. కానీ ఈ సినిమా దారుణంగా పరాజయం పాలైంది.

ఇప్పుడు లేటెస్ట్ గా రాశి ఖన్నా లాయర్ గా కనిపించనుంది. గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ లో రాశి ఖన్నాది సేమ్ రోల్.

Advertisement
 

More

Related Stories