
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి కలిశారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇంతకుముందు రెండు సార్లు చిత్ర పరిశ్రమ బృందంతో వెళ్లారు. సోమవారం తన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో సీఎంని కలుసుకున్నారు.
“ఆర్ ఆర్ ఆర్” సినిమాకి టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకి అనుమతి కోరేందుకే రాజమౌళి, నిర్మాత దానయ్య ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మాత్రమే అధిక ధరలకు టికెట్లు అమ్ముకునే వెసులుబాటుని కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే, ప్రత్యేక షోలకు కూడా కొన్ని నిబంధనలు విధించింది. ప్రభుత్వం పెట్టిన కొత్త నియమాలు అన్నింటికీ “ఆర్ ఆర్ ఆర్” వర్తిస్తుందని, అందుకే తమకి రేట్లు, షోల పెంపు అనుమతి ఇవ్వాలని వీరు కోరారు.
“ముఖ్యమంత్రి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ బాగా ఖర్చుతో కూడిన సినిమా. దానికి ఏం చేయాలో అది చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎలా చేస్తుందో చూద్దాం. అంతా సవ్యంగానే జరుగుతుంది,” అని రాజమౌళి అన్నారు.
“ఆర్ ఆర్ ఆర్” ఈ నెల 25న విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు.