
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. కాకపోతే, ఈ సినిమా షూటింగ్ ఆగుతూ, సాగుతూ అలా వెళ్తోంది. ఒకేసారి ఈ సినిమాతో పాటు ‘ఇండియన్ 2’ సినిమా కూడా తీస్తున్నారు శంకర్. అందుకే, చాలా ఆలస్యం అవుతోంది.
ఇక, తాజాగా హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. చారిత్రాత్మక చార్మినార్ వద్ద షూటింగ్ చేస్తున్నారు ఇప్పుడు. చార్మినార్ దగ్గర నిల్చొని శంకర్ ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోని షేర్ చేస్తూ, “కొత్త షెడ్యూల్ ని చారిత్రాత్మక చార్మినార్ వద్ద మొదలు పెడుతున్నా,” అని రాసుకున్నారు శంకర్.
ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతం #RC15 అని పరిగణిస్తున్నారు. రామ్ చరణ్ కిది 15వ చిత్రం. అందుకే అలా #RC15 అని అంటున్నారు. కియారా అద్వానీ మొన్నే తన ప్రియుడు సిద్ధార్త్ మల్హోత్రాని పెళ్లాడింది. అందుకే, ఆమెకి సంబంధించిన సీన్లు ఏవీ ఈ షెడ్యూల్ లో చేర్చలేదు.
రామ్ చరణ్ పై చార్మినార్ వద్ద ఒక పాటని తీస్తున్నారు. పాటలో కొంత భాగం మాత్రమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.