జగన్ ‘ప్రోత్సాహం’, వర్మ ‘వ్యూహం’!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజకీయంగా బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉండగానే ఆయన మళ్ళీ ప్రత్యర్థి పార్టీలను ఎలా బద్నామ్ చెయ్యాలనే ఆలోచిస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. దానిలో భాగంగానే ఇటీవల రామ్ గోపాల్ వర్మని కలిశారు.

వర్మతో రెండు సినిమాలు తీయించి రాజకీయంగా లాభం పొందే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. వర్మ నిన్న సీఎం జగన్ ని కలిశారు. ఈ రోజు వర్మ తన కొత్త సినిమా ప్రకటించారు.

“నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి,” అని వర్మ ప్రకటించారు.

ఎన్నికల కోసమే ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ ఒప్పుకున్నారు. “ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు,” అని తనదైన శైలిలో ట్వీటారు వర్మ.

సీఎం జగన్ ‘ప్రోత్సాహం’తో రామ్ గోపాల్ వర్మ తీసే ఈ సినిమా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులకు వ్యతిరేకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్రీగా డబ్బులు వస్తుండడంతో వర్మ కూడా హ్యాపీ.

Advertisement
 

More

Related Stories