‘హుషారు’ సినిమాతో పరిచయం అయ్యారు యువ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. అతని రెండో చిత్రం.. ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసి ఇది ‘ప్రేమదేశం’లా ఉందనే కామెంట్స్ వచ్చాయి.
“ప్రతి సినిమా దేనికో ఒకదానికి రిలేట్ అవుతుంటుంది. ‘రౌడీ బాయ్స్’ ని ‘ప్రేమ దేశం’ స్ఫూర్తిగా తీశానా అని అడిగితే లేదనే చెప్తా. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆధారంగా చేసుకుని చేశాను. మా కాలేజ్లోనే అటు ఇంజనీరింగ్ కాలేజ్.. ఇటు మెడికల్ కాలేజ్ ఉండేది. మా కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని కథ రాస్తే.. అది (దిల్) రాజన్నకి నచ్చింది. సినిమా చేశారు,” అని క్లారిటీ ఇచ్చారు శ్రీహర్ష.
“హుషారు సక్సెస్ తర్వాత దిల్ రాజుగారు ఓ రోజు పిలిచి కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఏదైనా కథ ఉందా? అన్నారు. ఉంది సార్! అని చెప్పి ఇది చెప్పను. ముందు ఇది ఆశిష్తో సినిమా చేస్తున్నామని రాజుగారు నాకు చెప్పలేదు. స్క్రిప్ట్ బాగా వచ్చిందని భావించిన తర్వాత రాజుగారు ఆశిష్తో సినిమా చేద్దామని అన్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి ఆశిష్ సూట్ అయ్యాడు,” అని అంటున్నారు హర్ష.
మరి దిల్ రాజ్ ఎంతవరకు వేలు పెట్టారు? “అలాంటిదేమీ లేదు. బెటర్ గా వచ్చేలా ప్రోత్సహించారు,” అనేది హర్ష మాట.
“ఆశిష్ చాలా బాగా యాక్టింగ్, డాన్సులు చేశాడు. మొదటి సినిమా అనిపించదు,” అని హీరోని మెచ్చుకున్నారు ఈ యువ దర్శకుడు. మరి కొత్త హీరో పక్కన న్యూ హీరోయిన్ ని తీసుకోవాలి కదా. ఆల్రెడీ అనేక సినిమాల్లో నటించిన అనుపమని తీసుకున్నది ఎందుకో?
“సినిమాలో హీరో కంటే హీరోయిన్ కాస్త పెద్దది. హీరో ఎంత రఫ్గా ఉంటాడో.. హీరోయిన్ అంత మెచ్యూర్డ్గా ఉండాలి. అందుకే అనుపమని తీసుకున్నాం,” అని అంటున్నారు దర్శకుడు. ఈ సినిమాలో రెండో హీరో కూడా ఉన్నాడు. అతనే విక్రమ్ సాహిదేవ్. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు.
“విక్రమ్ కళ్లలో మంచి ఇన్టెన్స్ ఉంటుంది. తన పాత్ర పెద్దగా మాట్లాడదు. కళ్లతో మాట్లాడేలా ఉంటుంది. అందుకని తనను తీసుకున్నాం.”