
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ థర్డ్ వేవ్ ఈసారి ఎవ్వర్నీ వదిలేలా లేదు. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ తో పోలిస్తే ఈసారి కరోనా వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఇదివరకే కరోనా బారిన సెలబ్రిటీలు, మరోసారి ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఈయన వైరస్ బారిన పడడం ఇదే తొలిసారి కాదు.
ఇంతకుముందు శరత్ కుమార్ తో పాటు, ఆయన భార్య రాధిక, కూతురు వరలక్ష్మి అంతా వైరస్ బారిన పడ్డారు. వరలక్ష్మి హైదరాబాద్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంది. ఆ వైరస్ నుంచి అంతా కోలుకున్న కొన్ని రోజులకే శరత్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు వైరస్ సోకినట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు, థర్డ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్నారు. అదృష్టవశాత్తూ ఈసారి వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదు. సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉంటున్నాయి. మరీ ప్రాణాంతకం కాదని వైద్యులు కూడా తేల్చిచెప్పారు. కాకపోతే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో అలసత్వంగా ఉండడం వల్లనే చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ లు, ఆంక్షలు విధించకపోవడం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయన హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు. హోం ఐసొలేషన్ లోనే కొనసాగుతూ, మెడిసిన్ తీసుకుంటున్నారు.