
అడివి శేష్ హీరోగా నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట హృదయం సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రేమ కథని అందంగా చూపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇప్పుడా పాటకు సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ ను విడుద చేశారు. శేష్-సయీ మధ్య రొమాన్స్, పెళ్లిని అందంగా చూపించారు. ఈ పాటతో సిద్ శ్రీరామ్ మరోసారి ఆకట్టుకున్నాడు.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.