
‘కలర్ ఫొటో’ సినిమాతో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా మారాడు. ఆ తర్వాత “రైటర్ పద్మభూషణ్”తో మరో విజయం చూశాడు. తాజాగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే “అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్” విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో నటిస్తున్నాడు.
ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సంకీర్తన విపిన్ కథానాయిక.
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టారు. అనీల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బలగం వేణు గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్ను అందించారు.
“బలగం” సినిమాతో మంచి బోణి కొట్టింది దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్. నిర్మాత దిల్ రాజు వారసులు ఈ బ్యానర్ పెట్టి చిన్న సినిమాలు తీస్తున్నారు. “ఆకాశం దాటి వస్తావా”, “సెల్ఫిష్” అనే మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు సుహాస్ కథానాయకుడిగా నాలుగో సినిమా ప్రారంభమైంది.